హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని కేంద్ర మంత్రి బండి సంజయ్ మనుషులు చంపాలని చూశారని, ఆయన ప్రోద్బలంతోనే కరీంనగర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుపై దాడికి పాల్పడ్డారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసులు కూడా ఆలస్యంగా స్పందించి కేసు పెట్టారని, ఎఫ్ఐఆర్లో సంజయ్ పేరు చేర్చలేదన్నారు. ఈ కేసులో సంజయ్ను నిందితుడిగా ఎఫ్ఐఆర్లో చేర్చాలని డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డీజీపీ సీవీ ఆనందన్ను కలిసి ఫిర్యాదు చేశారు.
కౌశిక్రెడ్డిపై దాడి కేసుతోపాటు కేటీఆర్ను అసభ్యకరంగా తిట్టినందుకు ప్రత్యేకంగా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కోరారు. బీజేపీ నేతలు అటాక్ చేస్తున్న సమయంలో చేష్టలుడిగి చూసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కౌశిక్ రెడ్డికి ప్రాణహాని ఉందని, ఆయనకు భద్రతను పెంచాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో శాంతిభద్రతలు దిగజారాయని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్, కేంద్ర మంత్రి సంజయ్ మధ్య ఉన్న చీకటి ఒప్పందాలు అందరికీ తెలుసని బీఆర్ఎస్ ఎల్పీ విప్ కేపీ వివేకానంద్ అన్నారు. సీఎంకు ఎప్పుడు ఆపద వచ్చినా.. సంజయ్ సహాయ మంత్రిగా ఉంటున్నారన్నారు. కేటీఆర్పై సంజయ్ వాడిన భాష.. బీజేపీ సిద్ధాంతాలకు తగ్గట్టుగా ఉందా అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
